Translate

Wednesday, October 30, 2019

కార్తీక మాసం లో దీపారాధన చేసేటప్పుడు మరియు దీపదానం చేసేటప్పుడు చదువవలసిన శ్లోకం


‘కార్తిక’ మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది.కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు.అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.

 *కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః* 
 *జలేస్థలే… ఫలే ఏ నివసంతి* 
 *జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ* *భాగినః* 
 *భవతింత్వ స్వపచాహి విప్రాః* 

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి.

కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి.ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.కార్తీకపౌర్ణమి నాడు సత్‌ బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ

” *సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!* 
 *దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ”* 

అనే శ్లోకం పఠించాలి.

‘దీపం జ్యోతి పరబ్రహ్మ:” దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. 

కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు



కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం… వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.
క్షీరసాగరమథనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయనీ, అదే ఉసిరి చెట్టుగా మారిందినీ ఓ నమ్మకం. సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! ఆయుర్వేదంలో ఆరు రుచులన పేర్కొంటారు అవి… మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కషాయం (వగరు), లవణం (ఉప్పదనం), కటువు (కారం), తిక్తం (చేదు). ఏ ఆహారపదార్థలోనైనా వీటిలో రెండో, మూడో, నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్బుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా అయిదు రుచులూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుచుకోవడం కద్దు. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు.
ఇక కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్‌ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి.
అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది.

Monday, October 28, 2019

కార్తీకమాసం

మాసాలల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. ఈ నెలలో స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, వనభోజనాలు ఈ నెలకు ప్రత్యేక మైన అంశాలు. 

*కార్తీకస్నానం:*
 ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం తెల్లవారు ఝామున చల్లనీటి స్నానం. దీనివెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శరత్‌రుతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్ష రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీకస్నానం. నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

*స్నానం ఎలా ఆచరించాలి:*

 చల్లటి నీటితో స్నానం చేయాలి. వృద్ధులు, ఆనారోగ్యంతో వున్నవారికి ఈ విషయంలో సడలింపు ఉంది. మొదట మామూలుగా స్నానం ఆచరించి, తర్వాత పొడి వస్త్రం ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం ఆచరించాలి. శ్లోకం రానివారు, చదవలేనివారు భగవన్నామ స్మరణతో స్నానమాచరించాలి.

*చదవాల్సిన శ్లోకం:*

 తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్యపావని
సర్వత్రా ద్రవరూపేణ సాసంసారే భవేత్ తథా

ఈ అవకాశం లేనివారు అంటే వృద్ధులు, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారు కనీసం శుద్ధపాడ్యమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో పైన చెప్పిన సమయాల్లో స్నానం ఆచరిస్తే 30 రోజులు స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది.
ఉద్యోగ కారణాలతో అవకాశం లేనివారు- కనీసం కార్తీక మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు  స్నానం ఆచరించి దేవాలయ సందర్శన చేసినా 30 రోజులు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.

కార్తికమాసం విశిష్టత

కార్తికమాసం విశిష్టత ఇదే!

కార్తికమాసం విశిష్టత ఇదే!

ఆస్తిక లోకంలో కార్తిక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తిక పురాణంతో పాటు మరికొన్ని వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. ఈ కార్తికమాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెల రోజులపాటు కార్తిక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఈ పురాణ క్రమాన్ని పరిశీలిస్తే తొలిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తికమాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. నైమిశారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉన్న శౌనకాది మునులకు వశిష్టుడు జనకుడికి చెప్పిన విశేషాలనే సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ మాసం గొప్పతనం విశిదమవుతుంది.

పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే!
కార్తికమాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమినాడు పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తిక శుక్ల ద్వాదశినాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ మాసానికి మరింత ప్రాముఖ్యాన్నిస్తారు భక్తులు. ఈ మాసంలో చెరువులు, బావులు, దిగుడు బావులు, పిల్ల కాలువలు అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది. కార్తికంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు. కార్తిక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఆ రోజున చేసే స్నాన, దాన, జపాదులు అధిక ఫలితాన్నిస్తాయి. ఆలయాలలో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాప హరణం అని చెబుతారు. 

కార్తికమాసం విశిష్టత ఇదే!
 

అభిషేకంతో పాటు...
ఈ మాసంలో తులసి దళాలు, గంధంతో సాలగ్రామాన్ని అర్చించటం క్షేమదాయకం. సాలగ్రామాన్ని ఉసిరిచెట్టు కింద కూడా పూజించటం శ్రేయస్కరం. కార్తికంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిశెపూలు, మల్లె, గరిక తదితరాలతోపాటు గంధ పుష్ప ధూప దీపాలతో అర్చన చేస్తారు. వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించటం వల్ల యముడి బారి నుంచి బయట పడవచ్చంటారు. ఈ మాసంలో చేసే హిరణ్య, రజత, తామ్ర, కాంస్య, ఉసిరి, దీప, లింగ, ధాన్య, ఫల, ధన, గృహ దానాలు మామూలు సమయాలకన్నా అధిక ఫలితాన్నిస్తాయి. కార్తికమాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో, ఎలాంటి నియమాలను పాటించాలో కార్తిక పురాణం వివరిస్తోంది. ఈ పురాణంలో ఉన్న అనేకానేక కథలు పురాణ మహాత్మ్యాన్ని వివరిస్తున్నాయి. 

కార్తికమాసం విశిష్టత ఇదే!

కార్తికమాసం ఉపవాసం విధానం ఇది
మిత్రవర్మ, తత్వనిష్ఠుడు, సత్రాజిత్తు, దేవశర్మ కుమారుడు (మూషికం), ద్రావిడ దేశపు స్త్రీ, అజామిళుడు, మందరుడు, ధర్మవీరుడు, సువీరుడు, పురంజయుడు, అంబరీషుడు లాంటి అనేకానేకుల ద్వారా ధర్మ మార్గ వర్తనం వివరించటం కనిపిస్తుంది. కార్తిక మాసం నెలరోజులు చేయాల్సిన విధులను, వ్రతాలను కార్తిక పురాణం పేర్కొంటోంది. ఒకటో రోజున అర్చన, అగ్ని పూజ నిర్వహించాలి. సాయంత్రంపూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్తుతించాలి. ఇలా కార్తికమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చెయ్యాలి. కార్తిక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్టుడు కార్తిక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు. సోమవారం వ్రతం మొత్తం ఆరు విధాలుగా చేసుకోవచ్చని వివరించాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది. కార్తిక సోమవారంనాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు. అలా చేయటం సాధ్యం కానివాళ్లు ఉదయం పూట యథాప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు. ఇలా చేయటాన్ని ఏకభుక్తం అని అంటారు. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయటాన్ని నక్తం అని అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచితం అని పిలుస్తారు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాల్గింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తిక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది. 

కార్తికమాసం విశిష్టత ఇదే!

సోమవారం వ్రత ఫలితం...
సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్లు నమక, చమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి. సోమవార వ్రత ప్రభావాన్ని వశిష్ట మహర్షి నిస్టురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి చెప్పాడు. నిష్టురి గారాబంగా పెరిగి తప్పుదోవ లెన్నెన్నో తొక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు కాలక్రమంలో మరణిస్తుంది. మరుసటి జన్మలో ఓ శునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తికమాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ స్మృతి పొందింది. ఆ వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేదపండితుడు ఇంటి బయటకు వచ్చి శునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. తాను కార్తిక సోమవార వ్రతాన్ని అవలంబించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహిస్తాడు. వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తిక సోమవార వ్రతాలలో ఒక సోమవారంనాటి ప్రతిఫలాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. క్షణాలలో ఒక దివ్య స్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది. వశిష్టుడు ఇలా కార్తిక సోమవార వ్రత మహాత్మ్యాన్ని జనకుడికి వివరించాడు.

Saturday, October 26, 2019

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం


నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః 
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః 
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః 

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః 
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే 
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే 
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే 
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః 
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే 
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి 
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా 
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్ 
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ 
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి 
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!