భారతీయ ఆరాధనా సంస్కృతిలో గణపతిని బహువిధ రూపాలతో పూజించడం కనిపిస్తుంది.
పురాణాల్లో, మంత్ర శాస్త్రాల్లో, ఎన్నో వినాయకమూర్తులు ఉన్నాయి. వాటిని ఉపాసించే పద్ధతులు అనేకం. గణపతి అవతారాలను కొన్ని పురాణాలు చక్కగా ఆవిష్కరించాయి. ఆ అవతారాల పేర్లను గాధలను గమనిస్తే ఎంతో చక్కని అద్భుతమైన తత్వాలు గోచరిస్తాయి. మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరించుకోవడమే ఆధ్యాత్మిక సాధన అయితే, ఆ సాధనకు అవరోధాలు విఘ్నాలు. వాటిని తొలగించి గ్రహించే పరతత్వమే విఘ్నేశ్వరుడు.
ముద్గల పురాణంలో ఏనిమిది గణేశ అవతారాలను వివరించారు.
*1) వక్రతుండావతారం :*
'మత్సరా'సురుని సమ్హరించినది ఈ అవతారం. సిమ్హ వాహనం పై ఉండే గణపతి ఇతడు. జీవుల "శరీరతత్వం'లోని దివ్యత్వం ఈ గణేశ రూపం.'దేవబ్రహ్మధారకుడు' అని పురాణం పేర్కొంది.
*2) ఏకదంతావతారం :*
'మదా'సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో 'జీవ' (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.
*3) మహోదరావతారం :*
'మోహాసురుని' నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు.'ఙ్ఞాన'చైతన్యానికి అధిపతి.
*4) గజాననావతారం :*
సాంఖ్య ( పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠాన దేవతగా కొలిచే ఈ స్వామి ఙ్ఞానప్రదాత. 'లోభా'సురుని సమ్హరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.
*5) లంబోదరావతారం :*
"క్రోధాసురుని మర్దించిన అవతారం. 'శక్తి' బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. 'దేవితత్వ' స్వరూపం - గణపతి అని పురాణం భావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి.
*6) వికటావతారం:*
'కామా'సురుని సమ్హరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. సూర్యబ్రహ్మ సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు.
*7) విఘ్నరాజావతారం:*
ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. 'మమతా'సురుని సమ్హరించిన ఈ స్వరూపాన్ని విష్ణుబ్రహ్మగా విష్ణుతత్వంగా చెబుతారు.
*8) ధూమ్రవర్ణావతారం :*
'అభిమానాసురుని' సమ్హరించిన ఈ అవతారం మూషిక వాహనం.పై శోభిల్లుతున్నది. 'శివ'రూపంగా అర్చించతగిన శైవతత్వమూర్తి ఇది.
ఈ ఏనిమిది అవతారాల వైనాలను గమనించితే ఒక చక్కని సమన్వయం తేటపడుతుంది.
1. శరీరంలోనూ, 2.జీవభావంలోనూ, 3.బుద్ధిశక్తిలోనూ 4.బ్రహ్మఙ్ఞానంలోనూ భాసించే భగవచ్ఛైతన్యం మొదటి నాలుగు అవతారాలు. 5.శక్తి 6.సూర్య 7.విష్ణు 8.శివ తత్వాలు ఒకే భగవంతుడి వ్యక్తస్వరూపాలు అనే ఏకత్వం తరవాతి నాలుగు అవతారాలు. పైఎనిమిది రూపాలున్న గణేశుని ఆరాధంచితే మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతాయంటారు. అవి: మాత్సర్యం, మదం, మోహం , లోభం ,క్రోధం, కామం, మమత( నాది అనే రాగం), అభిమానం ( అహంకారం) ఈ ఏనిమిది రకాల రాక్షసులే విఘ్నశక్తులు. వ్యక్తి పురోగతికి ఇవే విఘ్నాలు.... ఈ అసురగుణాలను ఈశ్వరారాధన ద్వారా తొలగించుకోగలిగితే అదే ఆరాధన, అర్చన, సాధన. వీటిని నశింపజేసే దైవబలాన్ని మనలో జాగృతపరచేందుకే వినాయకపూజ. పూజలో పరమార్ధం- మానవుడు దివ్యత్వ స్తిథికి పరిణమించడమే. భగవద్రూప, నామ, అవతార ఘట్టాల్లో ఋషులు చూసి, చూపించిన దివ్యభావాలివి...
No comments:
Post a Comment