నిరంతరం సత్యాన్వేషణ జరుపుతూ, అనుక్షణం విద్య గరుపుతున్న నిత్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన బ్లాగ్ ఇది. ఇందులో నా ఆలోచనలు, భావాలతో పాటు, వివిధ రకాల ఉపయుక్త సమాచారాన్ని పొందుపరుస్తాను, మీ సూచనలు, సలాహాలు సదా అభిలషణీయం. - డా. వేణు మాధవ శర్మ This blog is for the eternal seeker, always striving to learn and grow. I share reflections and insights, blending devotion with wisdom, along with practical guidance for your spiritual and educational path. Dr. M. Venu Madhava Sharma
Translate
Thursday, December 19, 2019
అమ్మవారి అర్చనలు
Monday, December 16, 2019
శివ ప్రదక్షిణ విధానము
శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం
Saturday, December 14, 2019
పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం (సప్త చిరంజీవులు)
Friday, December 13, 2019
చండీహోమం
Wednesday, December 11, 2019
దత్త జయంతి

దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!
దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.
దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్కోట మహరాజ్, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.
మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి హారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Sunday, December 8, 2019
రోగ నిరోధక మంత్రాలు
Tuesday, November 26, 2019
మార్గశిర మాస విశిష్టత
Sunday, November 17, 2019
శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం
Tuesday, November 5, 2019
మారేడు వృక్షం విశిష్టత

త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. శివరాత్రి నాడు తెలిసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు (మారేడు దళాలతో అర్చనలు), పర్వ దినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతుంటారు. ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. ‘మారేడు (మారాజు) నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని తెలుగు కవులు మారేడు పదాన్ని శ్లేషార్థంగా చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం ఇలా వివరిస్తోంది. ఈ వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా కనిపిస్తున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు విశిష్టత ఇదే!
మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తుంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించటం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానం, సుఖం వర్థిల్లుతూ ఉంటుంది.

మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్ళతో ఉన్న మారేడు కొమ్మను తాకటం, ఆ చెట్టును పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ చెట్టు కింద పాలు, నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందిన వాడు మహా పుణ్యాత్ముడవుతాడు. శివ ప్రసాదంలో పత్రం, పుష్పం, ఫలం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శవల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి. శివపూజ చేసే వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్తి మార్గాలలో భక్తులు శివపూజ చేస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. అలా చేయటం వల్ల వారికి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు. పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు. నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యం పెడతారు.
ఓంకారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. ఆ భక్తులు లింగాన్ని విభూతితో అర్చించటం, ఆ విభూతిని నైవేద్యంగా ఇవ్వటం కూడా ఉంది. అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు. ఇలా ఈ కథా సందర్భంలో మారేడు చెట్టు మహిమ గురించి శివభక్తులలోని ప్రవృత్తి, నివృత్తి అనే మార్గాలననుసరించే భక్తులను గురించి వివరించటం కనిపిస్తుంది. మారేడు వృక్షం ఇంత పవిత్రతను సంతరించుకొని ఉండటానికి ఆ చెట్టు దళాలు, బెరడు అన్నిటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్నారు
Friday, November 1, 2019
భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు (చింతా గోపి శర్మ సిద్ధాంతి భువనేశ్వరి పీఠం వారి వాట్సప్ పోస్ట్ నుండి)
Wednesday, October 30, 2019
కార్తీక మాసం లో దీపారాధన చేసేటప్పుడు మరియు దీపదానం చేసేటప్పుడు చదువవలసిన శ్లోకం
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు
Monday, October 28, 2019
కార్తీకమాసం
కార్తికమాసం విశిష్టత

ఆస్తిక లోకంలో కార్తిక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తిక పురాణంతో పాటు మరికొన్ని వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. ఈ కార్తికమాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెల రోజులపాటు కార్తిక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఈ పురాణ క్రమాన్ని పరిశీలిస్తే తొలిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తికమాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. నైమిశారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉన్న శౌనకాది మునులకు వశిష్టుడు జనకుడికి చెప్పిన విశేషాలనే సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ మాసం గొప్పతనం విశిదమవుతుంది.
పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే!
కార్తికమాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమినాడు పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తిక శుక్ల ద్వాదశినాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ మాసానికి మరింత ప్రాముఖ్యాన్నిస్తారు భక్తులు. ఈ మాసంలో చెరువులు, బావులు, దిగుడు బావులు, పిల్ల కాలువలు అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది. కార్తికంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు. కార్తిక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఆ రోజున చేసే స్నాన, దాన, జపాదులు అధిక ఫలితాన్నిస్తాయి. ఆలయాలలో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాప హరణం అని చెబుతారు.

అభిషేకంతో పాటు...
ఈ మాసంలో తులసి దళాలు, గంధంతో సాలగ్రామాన్ని అర్చించటం క్షేమదాయకం. సాలగ్రామాన్ని ఉసిరిచెట్టు కింద కూడా పూజించటం శ్రేయస్కరం. కార్తికంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిశెపూలు, మల్లె, గరిక తదితరాలతోపాటు గంధ పుష్ప ధూప దీపాలతో అర్చన చేస్తారు. వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించటం వల్ల యముడి బారి నుంచి బయట పడవచ్చంటారు. ఈ మాసంలో చేసే హిరణ్య, రజత, తామ్ర, కాంస్య, ఉసిరి, దీప, లింగ, ధాన్య, ఫల, ధన, గృహ దానాలు మామూలు సమయాలకన్నా అధిక ఫలితాన్నిస్తాయి. కార్తికమాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో, ఎలాంటి నియమాలను పాటించాలో కార్తిక పురాణం వివరిస్తోంది. ఈ పురాణంలో ఉన్న అనేకానేక కథలు పురాణ మహాత్మ్యాన్ని వివరిస్తున్నాయి.

కార్తికమాసం ఉపవాసం విధానం ఇది
మిత్రవర్మ, తత్వనిష్ఠుడు, సత్రాజిత్తు, దేవశర్మ కుమారుడు (మూషికం), ద్రావిడ దేశపు స్త్రీ, అజామిళుడు, మందరుడు, ధర్మవీరుడు, సువీరుడు, పురంజయుడు, అంబరీషుడు లాంటి అనేకానేకుల ద్వారా ధర్మ మార్గ వర్తనం వివరించటం కనిపిస్తుంది. కార్తిక మాసం నెలరోజులు చేయాల్సిన విధులను, వ్రతాలను కార్తిక పురాణం పేర్కొంటోంది. ఒకటో రోజున అర్చన, అగ్ని పూజ నిర్వహించాలి. సాయంత్రంపూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్తుతించాలి. ఇలా కార్తికమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చెయ్యాలి. కార్తిక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్టుడు కార్తిక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు. సోమవారం వ్రతం మొత్తం ఆరు విధాలుగా చేసుకోవచ్చని వివరించాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది. కార్తిక సోమవారంనాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు. అలా చేయటం సాధ్యం కానివాళ్లు ఉదయం పూట యథాప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు. ఇలా చేయటాన్ని ఏకభుక్తం అని అంటారు. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయటాన్ని నక్తం అని అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచితం అని పిలుస్తారు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాల్గింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తిక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది.

సోమవారం వ్రత ఫలితం...
సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్లు నమక, చమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి. సోమవార వ్రత ప్రభావాన్ని వశిష్ట మహర్షి నిస్టురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి చెప్పాడు. నిష్టురి గారాబంగా పెరిగి తప్పుదోవ లెన్నెన్నో తొక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు కాలక్రమంలో మరణిస్తుంది. మరుసటి జన్మలో ఓ శునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తికమాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ స్మృతి పొందింది. ఆ వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేదపండితుడు ఇంటి బయటకు వచ్చి శునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. తాను కార్తిక సోమవార వ్రతాన్ని అవలంబించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహిస్తాడు. వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తిక సోమవార వ్రతాలలో ఒక సోమవారంనాటి ప్రతిఫలాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. క్షణాలలో ఒక దివ్య స్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది. వశిష్టుడు ఇలా కార్తిక సోమవార వ్రత మహాత్మ్యాన్ని జనకుడికి వివరించాడు.
Saturday, October 26, 2019
దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం
Thursday, September 26, 2019
శరన్నవరాత్రి వేడుకలు (సేకరణ-ఈనాడు పేపర్ నుండి)

అమ్మంటే..ప్రేమ, ఆప్యాయత , అనురాగం, మమకారం.
అమ్మంటే..మార్గదర్శి, కార్యదక్షురాలు, శిక్షకురాలు.
అమ్మంటే... మందలింపు, అదిలింపు, దారితప్పిన వారికి బెదిరింపు.
జగత్తంతటికీ తల్లి అయిన జగదాంబ తత్త్వం ఇదే. మనలో నిలిచి ఉండి, నడిపించేది ఆ అమ్మే. పరతత్త్వానికి ప్రతీకగా నిలిచే అపరాజిత పూజకు సమయం ఆసన్నమైంది. ఆమెను తెలుసుకుందాం... మనసారా కొలుచుకుందాం...
దేవీ భాగవతంలో జగన్మాత తన గురించి బ్రహ్మకు స్వయంగా చెబుతూ... ఈ సృష్టిలో నేను కానిది ఏదీలేదని వివరిస్తుంది. ‘బుద్ధి, శ్రీ, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, స్పృహ, వాంఛ, శక్తి, వస, వాక్కు, మజ్జ, వృష్టి, చర్మం, రుతం, అనృతం.... ఇలా అన్నీ నేనే’ అంటుంది. సర్వ దేవతా రూపంనాదే. శక్తిని, పరాక్రమాన్ని నేనే అని చెబుతుందామె. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులు సైతం ఆ పరాశక్తికి లోబడి ఉన్నవారే. సృజన, పాలన, సంహారకాలనే మూడు శక్తులున్న ఆమె త్రిశక్తి స్వరూపిణి. వాటిలో బ్రహ్మకు సృజన శక్తిని, విష్ణువుకు పాలనా శక్తిని, శివుడికి సంహార శక్తిని ప్రసాదించి బ్రాహ్మి (సరస్వతి), వైష్ణవి(లక్ష్మి), శివాని (పార్వతి) రూపాల్లో వారి వెన్నంటి ఉండి లోకరక్షణ చేయిస్తోంది సాక్షాత్తు భగవతే అని దేవీ భాగవతం వివరిస్తోంది.
విశ్వమంతా వ్యాపించిన ఉన్న శక్తి ఒక్కటే. ఏకరూపంలోని ఈ శక్తి వివిధ అవతారాలను ధరించిందని ‘శ్వేతాస్వతారోపనిషత్తు’ చెబుతోంది. అన్నీ, అంతా తానైన దేవి ఎన్ని రూపాలు ధరించినా మూలశక్తి మాత్రం ఒకటే. ఈ విషయాన్ని నిరూపించేదే నవ శబ్దం. తొమ్మిది గుణిజాలు ఎన్నో ఉన్నా, అవి ఎంత పెద్దవి అయినా అన్నీ కలిపితే చివరికి మిగిలేది తొమ్మిదే. జగత్కారిణి అయిన దేవి ఎన్ని రూపాలు ధరించినా ఆమె తత్త్వం ఏకత్వం. భిన్న రూపాల్లో, శక్తుల్లో ఉన్న పరతత్త్వం ఆమే. ఇదే నవరాత్రి అంతరార్థం.
ప్రతి జీవిలోని చైతన్యం ఆమే. అలా అయినప్పుడు ఆ జీవిలో ఉన్న సర్వాంశలూ ఆమెవే కదా. రక్ష (రక్షించే), మంత్ర (మంత్రపూర్వక ఆవాహన), ప్రాణ (సకల జీవులకీ మూలమైన ప్రాణం), కళా (అన్ని కళలు), విశ్వ (విశ్వమంతటా వ్యాపించిన), విద్యా (సకల విద్యలు ఇచ్చే), వాగ్వైభవ (మాట్లాడే తీరు తెలిపే), సంహార (దుష్ట నాశనం), ధార్మిక (ధర్మమార్గాన నడిచేలా చూసే)... అనే నవవిధ శక్తుల సమాహారం జగన్మాత అని పురాణ కథనం. సృష్టికి, దాని గమనానికి దోహదపడే దేవతలందరికీ ఆధారభూతురాలు. ఆమె మహావిద్య, మహామాయ, పూర్ణరూపిణి, ప్రకృతి. అవ్యయ (మార్పు లేనిది) ఇచ్ఛారూపిణి (కోరుకున్న రూపం ధరించేది). వేదగర్భ(వేదాలకు మూలం), సర్వాధిష్టాన (సృష్టి అంతటికీ అధిదేవత)... అని దేవీభాగవత కథనం. ‘నవ’ అనే శబ్దానికి కొత్తది, తొమ్మిది, అనే అర్థాలతో పాటు ‘నూయతే స్తూయతే ఇతి నవః’... స్తుతి చేస్తే సుఖాలనిచ్చేది అనే అర్థం కూడా ఉంది. దేవిని తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో పూజించే వ్రతాన్ని నవరాత్రి వ్రతం అంటారు. దీన్ని ఆచరిస్తే పాపాలన్నీ హరించిపోయి ముక్తులవుతారు అని పురాణాలు చెబుతున్నాయి
ఆమె శారద:- శరత్కాలం ఆహ్లాదకరమైనది. దేవి అవతరించిది ఈ కాలంలోనే. శరది భవా శారదా... శరత్కాలంలో పుట్టింది కాబట్టి దేవికి శారద అనే పేరు వచ్చింది. ఆమె లోకకంటకులైన రాక్షసులని మట్టు పెట్టింది ఈ నవరాత్రుల్లోనే. సంవత్సరంలో మూడు రకాల నవరాత్రులు జరిపే సంప్రదాయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, గణేశ చతుర్థి పురస్కరించుకుని భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో శారదను స్తుతించే తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులుగా నిర్వహించుకుంటాం. వీటిలో శరన్నవరాత్రులు అత్యంత ప్రశస్తమైనవిగా భావిస్తారు. జగదాధారిణి అయిన జగన్మాతని కొలిచే నవరాత్రులు కావడంతో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో దేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం వస్తుందని నమ్ముతారు.
- రమాశ్రీనివాస్
ఏంటీ అలంకారాలు?

శరన్నవరాత్రులలో అన్ని శక్తి క్షేత్రాల్లోనూ అమ్మవారిని రోజుకొక్క రూపంలో అలంకరిస్తారు. దేవీ భాగవత పురాణం, తంత్రశాస్త్ర గ్రంథాలు ఈ రూపాలకు ప్రామాణికాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని భ్రమరాంబ, వరంగల్ భద్రకాళి తదితర క్షేత్రాల్లో అమ్మవారికి విశేషమైన అలంకారాలు చేసే ఆచారం ఉంది. సాధారణంగా లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, దుర్గ, మహాలక్ష్మి, మహిషాసుర మర్దిని, మహాకాళి, రాజరాజేశ్వరి రూపాలలో అమ్మ కొలువుదీరతారు. వీటికి పురాణ సంప్రదాయం ప్రామాణికం. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ‘స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి’ రూపం కూడా కనిపిస్తుంది. మొదటి రోజు ఈ అలంకారం చేయటం స్థానిక సంప్రదాయం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.. ఇవి అమ్మవారి రూపాలు. దశ మహావిద్య స్వరూపాలివి. నవరాత్రి సందర్భంగా శ్రీశైల భ్రమరాంబను ఈ రూపాలతో కొలుస్తారు. వీటికి తంత్రశాస్త్ర గ్రంథాలు ప్రమాణం. మార్కండేయ పురాణం దేవి రూపాలను వేరుగా చెబుతోంది. దీని ప్రకారం మహాకాళి, మహిషాసుర మర్దిని, చాముండి, నంద, రక్తదంతి, శాకంబరి, దుర్గ, మాతంగి, భ్రామరి అనేవి అమ్మ రూపాలు.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించిన మాతకు దుర్గ అని పేరు. దుర్గం అంటే కోట. మంచికి పెట్టని కోటలాంటి జగన్మాత సకల శుభాలనూ ఇస్తుందని భక్తుల నమ్మకం. పరతత్త్వానికి, పరమోన్నత వ్యక్తిత్వానికి ప్రతీక అయిన ఈమెను తెలుసుకోవడమే ఆజన్మాంత తపస్సు. అలాంటి దుర్గా స్వరూపాన్ని నవరాత్రుల్లో కొలిచే సంప్రదాయం ఉంది.
1వ రోజు

శైలపుత్రి :- హిమవంతుని కుమార్తె. పర్వత పుత్రి కాబట్టి పార్వతి అనీ పిలుస్తారు. ఆమె వృషభ వాహిని, శూల ధారిణి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు. భూ తత్త్వానికి ప్రతీక అయిన ధూసర వర్ణంలో కనిపిస్తారు. అమ్మకు బూడిద రంగు వస్త్రాలను అలంకరిస్తారు.
2వ రోజు

బ్రహ్మచారిణి:- హిమవంతుని కుమార్తె అయిన పార్వతి నారదుని ద్వారా తన గతజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంది. అప్పుడు తాను దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవినని, నారదుని ఉపదేశంతో ఈ జన్మలోనూ శివుని భర్తగా పొందడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. ఆ రూపం బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం, తెల్లటి వస్త్రాలతో దర్శనమిస్తుంది. తపస్సు చేసింది కాబట్టి తపశ్చారిణి అనీ పిలుస్తారు. ఈమెను పూజిస్తే వైరాగ్యం, సాధు జీవనం, అన్నింటా విజయం దక్కుతాయని నమ్ముతారు..
3వ రోజు

చంద్రఘంట: తలపై అర్ధచంద్రుడితో దర్శనమిచ్చే తల్లి ఈమె. పది భుజాలు... యుద్ధానికి సన్నద్ధమైనట్లు ధనుస్సు, బాణం, గద, శూలం, ఖడ్గం, పాశంతో దర్శనమిస్తుంది. పద్మం, కమండలం, అభయ హస్తం, వరద హస్తాలతో అలరారుతుందీమె. పౌర్ణమినాటి చంద్రుడిలాంటి గౌరవర్ణంలో దర్శనమిచ్చే అమ్మవారు భక్తుల మనస్సులకు ప్రశాంతతనిస్తారు. ఈ దేవిని పూజించడం వలన ధైర్యం, శత్రువుల్ని జయించే శక్తి కలుగుతుందని నమ్ముతారు.
4వ రోజు

కూష్మాండ:- పృథ్వికి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. సకల సృష్టికీ కారణమైన జగన్మాతను కూష్మాండగా కొలుస్తారు. ఈ రూపంలో దేవికి ఎనిమిది చేతులు. అందువల్ల అష్టభుజాదేవి అనీ పిలుస్తారు. చక్రం, గద, ధనుస్సు, బాణం తదితర ఆయుధాలతో పాటు కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం ధరించి దర్శనమిస్తారు. ఈ రూపంలో పూజించడం వల్ల రోగాలు నశించి ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయి. కర్తవ్య దీక్షకు సూచిక అయిన ఎరుపు రంగు దుస్తులను అమ్మకు అలంకరిస్తారు.
5వ రోజు

స్కందమాత: సింహవాహిని అయిన స్కందమాతది నాలుగు చేతుల రూపం. ఒక చేతిలో కుమారుడైన స్కందుణ్ణి, రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉంటారు. అభయ ముద్రలో దర్శనమిస్తారు. అమ్మను ఈ స్వరూపంలో పూజించడం వల్ల శాంతి, సౌఖ్యం కలుగుతాయని చెబుతారు. ఆకాశానికి, విశాలతత్వానికీ ప్రతీక అయిన నీలం రంగులో అమ్మను భావిస్తారు.
6వ రోజు

కాత్యాయని :- త్రిమూర్తుల తేజంతో అలరారుతుందీ దేవి రూపం. మహిషాసురుణ్ణి సంహరించడానికి ఎత్తిన ఈ అవతారాన్ని ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజించడం వల్ల ఈమెకీ పేరు వచ్చింది. నాలుగు చేతులున్న తల్లి వాహనం సింహం. ఒక చేతిలో ఖడ్గం, రెండో చేతిలో కమలం ధరించి దర్శనమిస్తారు. మిగిలిన రెండు చేతులూ వరద ముద్ర, అభయ హస్తంగా ఉంటాయి. కష్టాలు బాధలు తీరాలనే కోరికతో ఈ రూపంలో పూజిస్తారు. ప్రకృతికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగులో దర్శనమిచ్చే తల్లిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు.
7వ రోజు

కాళరాత్రి :- విరబోసుకున్న జుట్టు, నల్లని మేని ఛాయ, నాలుగు భుజాలతో గార్దభ వాహనంపై ఉంటుంది. అంత భయంకర రూపంలోనూ నాలుగు భుజాల్లో రెండు అభయ హస్తంగా , వరప్రసాద ముద్రలతో దర్శనమిస్తుంది. దుష్టులకు మాత్రమే భయంకరి. శిష్టులకు అభయంకరి అనే భావన ఇమిడి ఉందీ రూపంలో. పాపాలు, గ్రహ బాధలు తొలగిపోవడం ఈ రూపంలో దేవిని పూజించినందుకు ఫలితాలని చెబుతారు. అజ్ఞానానికి, అంధకారానికి ప్రతీక నలుపు. అజ్ఞానాన్ని తొలగించుకుని కొత్త వెలుగుల వైపు పయనించాలని అమ్మ నల్లని మేని రంగులోని ఉపదేశం. ఈమెను ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు.
8వ రోజు

మహాగౌరి :- వృషభ వాహిని. చతుర్భుజాలు కలిగి ఉండే ఈమె చేతుల్లో త్రిశూలం, ఢమరుకం, అభయ ముద్ర, వరప్రసాద ముద్రలతో దర్శనమిస్తుంది. తెల్లని వర్ణంలో అమ్మ కనిపిస్తుంది. శ్వేతవస్త్ర ధారిణి. ఈమెని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని చెబుతారు.
9వ రోజు

సిద్ధిదాత్రి :- సర్వసిద్ధులను ప్రసాదించేది కాబట్టి ఈమెకీ పేరు. కమలం ఈమె ఆసనం. నాలుగుభుజాలు కలిగి ఉంటుంది. వాటిల్లో శంఖం, చక్రం,గద, పద్మాలను ధరించి చుట్టూ భక్తులతో కొలువుదీరి ఉంటుంది. ఈ రూపంలో దేవిని పూజించడం వల్ల సర్వసిద్ధులు-శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.