Translate

Tuesday, September 22, 2020

హనుమంతుడికి తమలపాకులతో పూజ


ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడు. హనుమంతుడు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తారు. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష పరిహారం అవుతుంది.

మరో కథ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతాదేవికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే హనుమంతునికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

హనుమంతుని పూజించటం వలన కలుగు ప్రయోజనాలు..!

1. లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఉన్న వారికి త్వరగా గుణం కనిపడుతుంది.

2. హనుమంతుని(ఆంజనేయస్వామి)కి తమల పాకుల మాల వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.

3.సంసారంలో ప్రశాంతత లేని వారు తమల పాకుల మాల వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.

4. చిన్న పిల్లలు కొందరు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. ఇలాంటి వారు తమలపాకుల మాల వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.

5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే  తమలపాకుల మాల వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది

6.  శనైశ్చర స్వామి వల్ల ఇబ్బంది ఉన్నవారు హనుమంతుని (ఆంజనేయ స్వామి)కి తమలపాకుల మాల వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

7. సుందర కాండ పారాయణం చేసి  తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.

8. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల మాల సమర్పించి, ప్రసాదం తీసుకుంటే విజయం మీదే అవుతుంది.

9.హస్త,మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.

10. అరటి తోటల హనుమంతునికి (ఆంజనేయునికి) పూజ కోటిరెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు(ఆంజనేయుడు) అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.

11. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతాదేవిని  అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే హనుమంతుడు (ఆంజేయుడు) సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు, నిన్ను సింధూర రూపంతో ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అవుతాను అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.

12. హనుమంతునికి వడ మాల ఎందుకు వేస్తారో తెలుసా?

అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు.  వాయుపుత్రుడు కావడంతో అకాశానికి ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అపుడు వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. హనుమంతుని దవడ కి గాయమేర్పడి నది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలుస్తారు.బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న సమయం సూర్యగ్రహణం కావడంతో, సూర్యుడిని పట్టుకునేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి రాహువు తట్టుకోలేక, సూర్యుడిని పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకొని వేగంతో తనను మించిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయుడికి ఒక వరం ఇచ్చాడు.

రాహువుకు ప్రీతికరమైన మినుములతో వడలు (గారెలు) చేసి వాటిని మాలలాగా తయారుచేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహంతో ఏర్పడే బాధలు, దోషాల నుండి విముక్తుల్ని చేస్తానని, వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. రాహువుకు ప్రీతికరమైన మినుముతో వడలు  (గారెలు) చేసి తన శరీరం పోలిక అంటే పాములాంటి ఆకారంలో మాలగా వడలను హనుమంతునికి సమర్పిస్తే, రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. అందుచేతనే మినప పప్పు వడలు తయారుచేసి 54, 108 లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలుండవని చెబుతారు.🌹🌹🙏🙏🌹🌹

No comments: